తొర్రూర్‌‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

 తొర్రూర్‌‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు, వెలుగు: అభివృద్ధిలో తొర్రూరును మోడల్ గా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే  నెంబర్ వన్ మున్సిపాలిటీగా చేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి , నియోజకవర్గ ఇన్‌ చార్జి ఝాన్సీ రెడ్డి తెలిపారు.  ఆదివారం తొర్రూరు పట్టణంలోని పెద్ద చెరువులో జరుగుతున్న మినీ ట్యాంక్ బ్యాండ్ అభివృద్ధి పనులను  పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  పెద్ద చెరువు మినీ ట్యాంక్ బ్యాండ్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాక తొర్రూరు పట్టణానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్నారు.

దీంతో భూగర్భజలాలు పెరుగుతాయన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం మడిపెల్లి గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి, బోనాల పండుగలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి బోనాలు ఎత్తుకొని మొక్కులు చెల్లించారు.  గ్రామంలో  నూతన అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.